సాధారణంగా కొన్ని పుష్పాలు ఎప్పుడు వికసించకుండా కొన్ని కాలాలలో మాత్రమే వికసిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పుష్పాలను ఎంతో పవిత్రమైన పుష్పాలుగా, దేవతా పుష్పాలుగా భావిస్తారు. అలాంటి వాటిలో బ్రహ్మకమలం ఒకటి. బ్రహ్మ కమలాలు అన్ని పుష్పాల మాదిరిగా కాకుండా రాత్రిపూట మాత్రమే వికసిస్తూ కనువిందు చేస్తాయి. ఇలా బ్రహ్మకమలాలు వికసించడంతో చాలామంది వీటిని పవిత్రంగా భావించి పూజలు కూడా చేస్తారు.
ఇలాంటి బ్రహ్మకమలం సోమవారం రాత్రి నల్గొండ జిల్లా అమూల్య కాలనీలో పుష్పాల వెంకన్న నివాసంలో వికసించడంతో ఆ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసించి.. కొంత సమయం పాటు తాజాగా ఉండే ఈ పుష్పాన్ని చూడటం కోసం స్థానికులు పెద్ద ఎత్తున అతని ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ 2020 సంవత్సరంలో బ్రహ్మ కమలం మొక్కని నాటానని అయితే కేవలం స్వచ్ఛమైన నీరు బ్రహ్మకమలానికి పోసినప్పుడు మాత్రమే ఆ మొక్క మనుగడ ఉంటుందని తెలియజేశాడు. ప్రస్తుతం తన ఇంటిలో పూసిన బ్రహ్మ కమలాన్ని చూడటం కోసం స్థానికులు అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని.. ఎంతో పవిత్రమైన పుష్పం వికసించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.