తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్ లో చోటు చేసుకున్న చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనపై ప్రత్యేకంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే ఆ చిన్నారిపై అంతటి దారుణానికి పాల్పడిన రాజు అనే నిందితుడు చనిపోయాడు. రైల్వే ట్రాక్ మీద అతని మృత దేహం కనిపించింది. అతని చేతిపై ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా అతను రాజు అని పోలీసులు నిర్దారించారు.
రాజు కోసం ఓ వైపు రాష్ట్రం మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతను తాజాగా ఉప్పల్ సమీపంలో కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారించారు. అయితే అతని మృత దేహం స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై కనిపించింది. ప్రజలు అతన్ని చుట్టు ముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిందితుడు రాజుపై ఇప్పటికే రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. అతన్ని పట్టిస్తే ఆ మొత్తం ఇస్తామని తెలిపారు. కానీ అతను రైల్వే ట్రాక్పై చనిపోయి కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.