ముంబైకి చెందిన ఓ యువతి చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలనే తీసింది. టూత్ పేస్ట్ అనుకుని ఆమె ఎలుకల విషంతో దంతాలను తోముకుంది. తరువాత హాస్పిటల్లో చేరి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ధారవికి చెందిన 18 ఏళ్ల అఫ్సానా ఖాన్ అనే యువతి సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం యథావిధిగానే నిద్రలేచి దంతాలను తోముకుంది. అయితే అంతకు ముందు టూత్ పేస్ట్ వద్ద ఎలుకల విషాన్ని ఎవరో ఉంచారు. ఆ విషయాన్ని గమనించని ఆమె టూత్ పేస్ట్కు బదులుగా ఎలుకల విషంతో దంతాలను తోముకుంది.
తరువాత కొంత సేపటికి తల తిరిగినట్లు అనిపించి, కడుపులో నొప్పిగా ఉండడంతో ఎందుకో ఆమె టూత్పేస్ట్ను చెక్ చేస్తే అది ఎలుకల విషం అని తేలింది. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించారు. కానీ ఎక్కడా ఆమెకు మెరుగైన వైద్యం లభించలేదు.
చివరకు ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా ఆమెను సెప్టెంబర్ 12వ తేదీన సర్ జేజే హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.