సాధారణంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరు దేవుళ్లకు పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజలు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఆ పుష్పాలు ఆ దేవుళ్ళకి ఎందుకు అంత ప్రీతికరం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎరుపు మందారాలతో కాళీ మాతకి పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుందని చెబుతారు. ఎరుపు రంగు అమ్మవారి నాలుకకు ప్రతీక. అందుకోసమే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఎరుపు రంగు మందారాలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా పారిజాత పుష్పాలతో విష్ణుమూర్తికి పూజ చేయడం శుభకరం. పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఉన్నది కనుక ఆ వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లడం వల్ల ఈ పారిజాత పుష్పాలతో పూజ చేస్తే శ్రీహరి అనుగ్రహం పొందగలుగుతాము.
గోగి పువ్వు విజ్ఞానానికి తెలివితేటలకు ప్రతీక. ఈ పుష్పాన్ని సరస్వతీ మాతకు సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం కలిగి విద్యా బుద్ధులు, తెలివి తేటలు కలుగుతాయని భావిస్తారు. అందుకోసమే గోగి పువ్వులతో సరస్వతీ దేవికి పూజ చేయడంవల్ల విద్యాబుద్ధులు తెలివితేటలు కలుగుతాయని భావిస్తారు. ఇక శ్రీకృష్ణుడికి తులసి మాలతో పూజ చేయటం వల్ల ప్రీతి చెందుతాడని పండితులు చెబుతున్నారు.