చిన్నతనం ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో తీపి గుర్తుగా మిగిలిపోవాలి. ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యంపై కుటుంబ భారం పడింది. స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా ఆడుకోవలసిన ఆ పసివాడు తన కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని ఎనిమిదేళ్ళ వయసులోనే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాడు. 8 ఏళ్ల కుర్రాడు ఒక్క రోజు పనికి వెళ్లకపోతే కుటుంబం గడవడం భారంగా మారుతుంది. ఈ చిన్నారి పరిస్థితి వింటే ఎవరికైనా అయ్యో పాపం అనిపించకమానదు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న ఓ బ్యాటరీ ఆటోను చూశాడు. అయితే ఆటో నడుపుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఆ ఆటో నడుపుతున్న ఎనిమిది సంవత్సరాల బాలుడిని చూసి ఆశ్చర్యానికి గురైన ఆ వ్యక్తి ఆటో ఆపి ఆ కుర్రాడిని ప్రశ్నించాడు. అసలు ఇంత చిన్న వయసులో ఆటో నడపడానికి గల కారణం ఏంటని ఆ కుర్రాడిని ప్రశ్నించగా అక్కడికి పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు.
ఈ క్రమంలోనే ఆటోలో వెనుక వైపు కూర్చున్న వ్యక్తి స్పందిస్తూ ఆ కుర్రాడి పేరు రాజగోపాల్ రెడ్డి అని తను వారి పెద్ద కొడుకు అని సమాధానం చెప్పాడు. తను, తన భార్య ఇద్దరూ అంధులు కావటం వల్ల కుటుంబ పోషణ భారమైందని, ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబ బాధ్యతను తీసుకున్నాడని ఆ వ్యక్తి తెలియజేశాడు. ఇంత చిన్న వయస్సులో లైసెన్స్ లేకుండా బండి నడపడం చట్టపరంగా నేరమని తెలిసినప్పటికీ కుటుంబ పోషణ కోసం తప్పడంలేదని, ఒక్కరోజు వీరు కష్ట పడకపోతే కుటుంబం మొత్తం పస్తులు ఉండాలని తెలిపాడు. తన తండ్రితో పాటు ఆటోలో పప్పు దినుసులు వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నట్లు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, అతని తండ్రి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.