Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటి వరకు కేవలం రూ.25వేల వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తూ వచ్చారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ మేర మాత్రమే పంట రుణాలను మాఫీ చేశారు. కానీ ఇకపై రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ ఆదివారం సీఎం కేసీఆర్తో సమావేశమై నిర్ణయం తీసుకుంది.
ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయంపై చర్చ జరిపారు. పంట రుణాలకు సంబంధించిన వివరాలను కేబినెట్కు ఆర్థిక శాఖ అందజేసింది. ఈ క్రమంలో రైతులకు ఆగస్టు 15వ తేదీ నుంచి పంట రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఆఖరి వరకు రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 6 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది.
ఇక రాష్ట్ర కేబినెట్లో వ్యవసాయంపై ప్రధానంగా చర్చ జరగ్గా.. అందులో రైతులకు సాగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేబినెట్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర అంశాలపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే పత్తి పంట సాగుపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నందున ఆ పంట సాగును ఇంకా పెంచాలని, అందుకుగాను రాష్ట్ర రైతాంగాన్ని సిద్ధం చేయాలని కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.