విధి అతనితో వింత నాటకం ఆడింది. పైసా పైసా కూడబెట్టి ఆపరేషన్ కోసమని రూ.లక్షలు దాచుకుంటే వాటిని ఎలుకలు కొరికేశాయి. దీంతో ఆ వ్యక్తి పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. తన పొట్టలో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించుకునేందుకు కష్టపడి పైసా పైసా కూడబెట్టి, కొందరి వద్ద అప్పులు చేసి రూ.2 లక్షలు పోగు చేశాడు. ఆపరేషన్కు ఆ మొత్తం అవసరం అవుతుందని చెప్పడంతో దాన్ని ఎట్టకేలకు పూర్తి చేశాడు. అయితే అతని దురదృష్టమో, మరొకటో తెలియదు కానీ.. విషాదకరమైన సంఘటన జరిగింది.
అతను కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును, దానికి తోడు మిగిలిన నగదును మొత్తం కలిపి రూ.2 లక్షలను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. రూ.500 నోట్లను ఎలుకలు కొరికి పాడు చేశాయి. దీంతో వాటిని చూసి అతను లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి అతని గోడును ఎవరైనా పట్టించుకుంటారా, లేదా.. అన్నది చూడాలి.