కరోనా నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటి వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను విధించి అమలు చేసిన సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్డౌన్ సమయాలను తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ కొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వాహనాలు సీజ్ చేయబడిన వారు తమ వాహనాలను జరిమానా చెల్లించి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు వాహనాలను తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీల కార్యాలయాలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాహనదారులు జరిమానాను ఆన్లైన్లోనూ చెల్లించి తమ వాహనాలను వెనక్కి తీసుకెళ్లవచ్చు. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో మాత్రం వాహనదారులు కోర్టులో హాజరు కావల్సి ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాహనాలను అందిస్తారు.