ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి బ్రహ్మాస్త్రను ప్రచారం చేయడంతో సినిమాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జక్కన్న బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య రాజమౌళి టీమ్తో కలిసి చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇక తాజాగా హైదరాబాద్లో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన హాజరుకానున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి తన ఫ్రెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నాడు. బ్రహ్మాస్త్ర మూవీలో రాజమౌళి సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వడాన్ని బట్టి చూస్తే.. జక్కన్న ఈ మూవీకి సమర్పకుడిగా మాత్రమే కాదని, వాస్తవానికి సినిమా రిటర్న్స్లో వాటాను కలిగి ఉండవచ్చని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ఇక్కడ మార్కెట్ చేసేందుకు మేకర్స్ రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర మూవీతో రాజమౌళి ఎంత సంపాదిస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది. సినిమా స్థాయిని బట్టి అతను కచ్చితంగా ఫ్యాన్సీ అమౌంట్ ని జేబులో వేసుకుంటాడు అని ఓ తెలుగు నెటిజన్ కామెంట్ చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి ప్రమోషన్స్ వల్ల బాలీవుడ్ కి పూర్వవైభవం వస్తుందో లేదో చూడాలి.