టెలివిజన్ షోలు టీఆర్పీ రేట్లే లక్ష్యంగా వివిధ రకాల షోలను నిర్వహిస్తాయి. కానీ కుటుంబసమేతంగా చూసేలా ఆహ్లాదకరంగా ఉంటూ.. ప్రతిభను వెలికి తీసుకురావడంపై దృష్టిసారించే కార్యక్రమాలు కొన్నే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కూడా సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మారాయి. హాస్య నటులు సింగింగ్ షోకి హోస్ట్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు వారు ఏకంగా లెజెండరీ సింగర్స్తో కలిసి పాడుతున్నారు.
తాజాగా ఒక సింగింగ్ షో ఎపిసోడ్లో జబర్దస్త్ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ ప్రముఖ సీనియర్ సింగర్ చిత్రతో కలిసి యుగళగీతం ఆలపించాడు. అందం హిందోళం అనే సూపర్ హిట్ పాటను వారిద్దరూ కలిసి పాడారు. అయితే ఇది చాలామంది సంగీత ప్రియులను కలవరపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో పలువురు సుధీర్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. చిత్రమ్మకు బాధగా ఉంది.. అని కొందరు కామెంట్ చేయగా, చాలామంది అదే భావాన్ని ప్రతి ధ్వనించారు.
సుడిగాలి సుధీర్ ప్రతిభావంతుడైన హాస్యనటుడు, అయితే అతన్ని చిత్రమ్మతో యుగళగీతం పాడించడం అన్యాయమని చాలా మంది సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సంగీతాన్ని కామెడీ టేకోవర్ చేయడానికి అనుమతించినందుకు ఆ షోపై కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. లెజెండరీ సింగర్, దివంగత బాల సుబ్రహ్మణ్యం హోస్ట్ చేసిన గొప్ప షోలు, ఆయన ప్రదర్శనలను ఆస్వాదించిన అభిమానులకు ఇటీవలి షోలు మరింత చికాకును కలిగిస్తున్నాయి.
ఎస్పీబీ ఇన్నాళ్లూ హోస్ట్ చేసిన సూపర్హిట్ సింగింగ్ షో కూడా ఇప్పుడు చాలా కృత్రిమంగా మారిపోయిందంటున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే టాలెంట్ షోలకి రోజులు గడిచిపోయాయని, ఇప్పుడు టీఆర్పీలే లక్ష్యంగా షోలు నిర్వహిస్తున్నాయని.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.