Hyper Aadi : బుల్లితెరపై పలు టీవీ షోల ద్వారా హైపర్ ఆది ఎలా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ వేదికపై ఆది చేసే హంగామ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోలో గత కొద్ది రోజులుగా ఆది కనిపించడం లేదు. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోనే కనిపిస్తున్నాడు. అయితే గతంలో జబర్దస్త్ వేదికపై పలువురు అగ్ర హీరోలు, రాజకీయ నాయకులను మిమిక్రీ చేస్తూ కొందరు చేసిన స్కిట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో అప్పట్లో పలువురు జబర్దస్త్ కమెడియన్లు ఫ్యాన్స్కు సారీ చెప్పారు. అయితే ఆ విషయాన్ని మరిచిపోయాడో ఏమో తెలియదు కానీ.. హైపర్ ఆది కూడా తాజాగా మళ్లీ అలాంటి తప్పే చేశాడు. సీఎం వైఎస్ జగన్ను అనుకరించి స్కిట్ చేశాడు. అయితే అది బోల్తాకొట్టింది. అది ఆదికే రివర్స్లో తగిలింది. దీంతో ఆదిని అటు వైసీపీ ఫ్యాన్స్, ఇటు సీఎం జగన్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సీఎం జగన్ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే పదాలను బాగా వాడారు. అయితే కేవలం పదాలను మాత్రమే కాదు.. ఆయన చేసిన పాదయాత్ర.. ఇచ్చిన హామీలు నచ్చి జనం ఆయనను సీఎంను చేశారు. అయితే ఇటీవల సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ కూడా అవే డైలాగ్స్ను వాడారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ మహేష్ను మెచ్చుకున్నారు. అయితే ఆ డైలాగ్లను సీరియస్గా వాడాలి కానీ.. కామెడీ కోసం వాడకూడదు. ఆ విషయం కూడా తెలియకుండా హైపర్ ఆది.. తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఇవే డైలాగ్లను వాడాడు.

మేము ఉన్నాం.. అని ఒక యువకుడు ఈ ప్రోమోలో అనగా.. ఇంకొక యువకుడు మేము విన్నాం అంటాడు. దీంతో హైపర్ ఆది.. సరే మేము ఉంటాం.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా డైలాగ్లు చెప్పడంతో ఆదిపై వైసీపీ ఫ్యాన్స్, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆది స్పందించాల్సి ఉంది.