Manchu Vishnu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొంత కాలంగా వివాదాలు నెలకొన్న విషయం విదితమే. అయితే మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ను కలిసి చర్చించారు. ఇక తాజాగా మరోమారు ఆయన ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్తో కలిసి సీఎం జగన్ను కలిసి మళ్లీ ఆయా సమస్యలపై చర్చించారు. దీంతో టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని భావిస్తున్నారు.
అయితే టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ను కలిసిన ఒక రోజు తరువాత ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోహన్ బాబు వైసీపీ నేత. అందులో భాగంగానే ఆయనను కలిశారని అనుకోవడానికి లేదు. పైగా ఆ సమావేశంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. దీంతో ఆ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే సమావేశం అనంతరం విష్ణు టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని తమతో చర్చించారని.. ఈ విషయంలో సంతృప్తిగా ఉందని చెబుతూ ట్వీట్ చేశారు. అయితే నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేసి ఊరికే థ్యాంక్స్ చెప్పారు. దీంతో విష్ణుకు నెటిజన్ల నుంచి మరిన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.
It was a absolute pleasure hosting you at our home Sri. Nani garu. Much thanks for protecting the interests of TFI ???? pic.twitter.com/HjV3pK8yYJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022
సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఒక మాట మీద నిలబడాలని చెప్పిన మోహన్ బాబు, విష్ణు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలాగే చిరంజీవి జగన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంచు ఫ్యామిలీ కూడా వెళ్లి ఉండవచ్చు కదా.. అందుకు వారికి కలిగిన నొప్పి ఏమిటో చెప్పాలి.. అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ముందుగా మోహన్ బాబే ఈ సమస్యను పరిష్కరించి ఇండస్ట్రీకి పెద్ద అయి ఉండవచ్చు కదా.. అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు చేస్తున్న విమర్శలకు మంచు ఫ్యామిలీ వద్ద సమాధానం లేదని స్పష్టమవుతోంది. చిరంజీవి కన్నా తామే ముందుగా స్పందించి జగన్తో చర్చించి ఉంటే తమకే క్రెడిట్ అంతా దక్కేది కదా.. అన్న భావనలో మంచు ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఇంకా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.