Samantha : దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. శాకుంతలం. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కనిపించనుంది. ఆమెకు జతగా దుష్యంతుడి పాత్రలో మళయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
శాకుంతలం సినిమాలో అసుర పాత్రలో కబీర్ సింగ్ నటిస్తున్నారు. గోపీచంద్ జిల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన కబీర్ సింగ్.. శాకుంతలం చిత్రంలోనూ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అసుర పాత్రలో ఆయన నటించారు. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలను వెల్లడించారు.
తనకు దర్శకుడు గుణశేఖర్ టెస్ట్ లుక్ చేశారని.. ఈ పాత్ర తనకు సరిగ్గా సరిపోయిందని, అందుకని గుణశేఖర్ తనకు అసుర పాత్రను ఇచ్చారని తెలిపారు. ఇక శాకుంతలం సినిమాలో తనకు, దుష్యంతుడి పాత్ర చేసిన దేవ్ మోహన్కు మధ్య భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, 10 రోజుల పాటు ఎంతో కష్టపడి యుద్ధ సన్నివేశాలను తీశారని తెలిపారు.
ఈ సినిమాలో భాగంగా తాను 18 కిలోల కిరీటాన్ని ధరించానని, అది ఎంతో భారంగా అనిపించిందని, అలాగే ఛాతిపై ధరించిన రక్షణ కవచం కూడా చాలా బరువుగా ఉండేదని కబీర్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ తన గత చిత్రాలతో పోలిస్తే శాకుంతలంలో తాను భిన్నంగా కనిపిస్తానని.. తనకు ఈ పాత్ర సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.