Chiranjeevi : కరోనా.. అది ఎవరినీ వదలడం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. అని తేడా లేకుండా అందరికీ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబు, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్, విశ్వక్ సేన్, త్రిష తదితర నటీనటులు ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి కోవిడ్కు గురవడం అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తోంది.
తాను కరోనా బారిన పడ్డాననే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నానని, అయినప్పటికీ కరోనా బారిన పడ్డానని చిరంజీవి తెలిపారు. తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వివరించారు. తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరగా కోలుకుని మళ్లీ అభిమానుల ముందుకు వస్తానన్నారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా చిరంజీవి ప్రస్తుతం పలు వరుస సినిమాలను చేస్తున్నారు. ఓ వైపు ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. మరోవైపు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల షూటింగ్లో మెగాస్టార్ పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఆయన ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఇండస్ట్రీకి అనుకూలంగా ఓ నిర్ణయం వస్తుందని తెలిపారు.
Dear All,
Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.
I request all who came in contact with me over the last few days to get tested too.
Can’t wait to see you all back soon!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2022
కాగా భోళా శంకర్ చిత్ర షూటింగ్లో చిరంజీవి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఇటీవలే కరోనా బారిన పడింది. అయితే కీర్తి సురేష్ నటించిన మరో మూవీ గుడ్ లక్ సఖి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 26న హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావల్సి ఉంది.
కానీ చిరంజీవి కరోనా బారిన పడడంతో ఆయన లేకుండానే ఆ ఈవెంట్ను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 28వ తేదీన విడుదల కానుంది. ఇక తాజాగా పద్మ అవార్డులను అందుకున్న అందరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.