Tollywood : కరోనా మూడో వేవ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా పడింది. తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ మూవీ వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఫిబ్రవరిలో రెండు పెద్ద మూవీలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రవితేజ నటించిన ఖిలాడి, పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య కొంత వరకు తగ్గి పరిస్థితులు చక్కబడుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11న, భీమ్లా నాయక్ను ఫిబ్రవరి 25న విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ఇక ఖిలాడి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లను మొదలు పెట్టగా అటు భీమ్లా నాయక్ టీమ్ కూడా ఇప్పటికే చాలినంత పబ్లిసిటీ చేసింది. ఈ క్రమంలోనే ఇరు చిత్ర యూనిట్లు త్వరలో టీవీ ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగంగా నిర్వహిస్తారని తెలుస్తోంది.
కాగా ఫిబ్రవరిలో ఈ రెండు పెద్ద సినిమాలతోపాటు డీజే టిల్లు, శేఖర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. వంటి చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీలకు బహుశా ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
అయితే ఖిలాడి, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల అయ్యే వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోతే చిత్రాలను విడుదల చేస్తారా.. లేదా.. అన్నది సందేహంగా మారింది. మరి అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.