News : కుటుంబ సభ్యులను కూడా కాదని బయటకు వచ్చి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించింది. ప్రేమ పెళ్లి కనుక భర్త తనకు జీవితాంతం తోడుంటాడని భావించింది. కానీ ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. ఆమె కన్న కలలు కల్లలు అయ్యాయి. పాప పుట్టాక ఆమెకు అతను దూరం అయ్యాడు. ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడి చనిపోయే స్థితిలో ఉందని తెలిసినా.. ఆ మృగాడి కఠిన హృదయం కరగలేదు. చివరకు ఆ చిన్నారితోపాటు ఆమె తల్లి ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విల్లుపురం జిల్లా మనలూరుపేట్లోని మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన వినోద్ కుమార్కు మనలూరుపేట్లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఆషా(26)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించారు. అయితే వినోద్ పెద్దగా చదువుకోలేదు. దీంతో అతను రోజూ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
అయితే ఆషా నర్సు గనక అదే హాస్పిటల్లో యథావిధిగా రోజూ పనికి వెళ్తుండేది. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆ చిన్నారికి కావ్య అని పేరు పెట్టారు. కాగా కావ్యకు ఇటీవలే ఏడాది నిండింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట కావ్యకు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆషా తను నర్సుగా పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఆమెకు చికిత్స అందించింది. అయినా చిన్నారి ఆరోగ్యం కుదుట పడలేదు.
అయితే కావ్య అనారోగ్యం పాలవడానికి ముందే వినోద్ వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. పాప తీవ్ర అనారోగ్యంతో ఉందని, చనిపోయే స్థితిలో ఉందని, ఒక్కసారి వచ్చి చూడాలని ఆషా బతిమాలింది. అయిప్పటికీ వినోద్ పాషాణ హృదయం కరగలేదు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి కన్ను మూసింది. పాప మరణాన్ని తట్టుకోలేని ఆషా మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు వినోద్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.