హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఓ వ్యక్తి తీవ్రగాయాలతో బయట పడ్డాడు. అయితే అతను ఈ ప్రమాదం ఎలా జరిగిందో షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
గచ్చిబౌలి – హెచ్సీయూ రోడ్డు మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టులు ఎం.మానస (23), ఎన్.మానస (21), ప్రయివేటు బ్యాంకు ఉద్యోగి షేక్ అబ్దుల్ రహీమ్ (22)లు చనిపోగా.. సాయిసిద్ధ్ అనే యువకుడు బయట పడ్డాడు. ఈ క్రమంలోనే అతను పోలీసులతో మాట్లాడాడు.
శనివారం ఉదయాన్నే షూటింగ్ ఉందని శుక్రవారం రాత్రి ఎం.మానస, ఎన్.మానస తమ గదికి వచ్చారని సాయి తెలిపాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగారని అన్నాడు. అమ్మాయిలిద్దరూ బీర్లు సేవించారని అన్నాడు. అయితే మద్యం సేవించిన తరువాత చాయ్ తాగుదామని అమ్మాయిలు ఒత్తిడి చేశారని, తాను డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే పట్టుబడతాం.. వద్దని ఎంత చెప్పినా వినలేదని, దీంతో కార్లో బయటకు వచ్చామని తెలిపాడు.
మార్గమధ్యలో గచ్చిబౌలి హెచ్సీయూ బస్ డిపో వద్దకు చేరుకోగానే రహీమ్ కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించాడని.. దీంతో కారు ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టిందని, ఈ క్రమంలో అందరమూ చెల్లా చెదురుగా పడిపోయామని తెలిపాడు. కారును నిర్లక్ష్యంగా నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు.
కాగా ఎం.మానసది మహబూబ్ నగర్ జడ్చర్ల అని, ఎన్.మానసది కర్ణాటక అని.. వీరు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలలో నటిస్తూ అమీర్పేట హాస్టల్లో ఉంటున్నారని తెలిపాడు. రహీమ్ కుటుంబం మొత్తం అతడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోందని, అతను చనిపోవడంతో వారు అనాథలయ్యారని తెలిపాడు. కాగా వారు ప్రయాణించిన కారుపై ఇప్పటికే రూ.15వేల చలానాలు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.