Tollywood : ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గాడిన పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తుండడంతో వచ్చేనెల నుంచి పెద్ద ఎత్తున భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి సమయంలోనే అనుకోని విధంగా పిడుగులాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంత ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి.
ఇప్పటికే ఈ వేరియంట్ గురించి అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వైరస్ కనుక ఇండియాలో వ్యాప్తి చెందితే ఈ ప్రభావం తప్పనిసరిగా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతుందని తెలుస్తోంది. కరోనా రెండవ దశలో భాగంగా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ భయాందోళనల నుంచి బయట పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.
ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్యనిపుణులు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇక ఈ వేరియంట్ కేసులు కనుక తెలుగు రాష్ట్రాలలో నమోదయితే మరోసారి టాలీవుడ్ పై కోలుకోలేని దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఇవన్నీ సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒమిక్రాన్ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. మరి ఈ వేరియంట్ ప్రభావం టాలీవుడ్ పై ఏవిధంగా ఉండబోతోంది.. అనే విషయం కొద్ది రోజులలో తెలియనుంది. డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా విడుదల కానుండడంతో.. ఈ మూవీ కలెక్షన్లపై ఒమిక్రాన్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై కూడా త్వరలో ఏ విషయమూ తేలనుంది.