దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. మే 1 నుంచి 18 – 44 సంవత్సరాల వయసు వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేడు, రేపు 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వాక్సినేషన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో శని,ఆదివారాలలో వ్యాక్సిన్ పంపిణీ ఉండదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన వ్యాక్సిన్ డోసులు అందకపోవడంతో రెండు రోజులపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ వేసినట్లు అధికారులు తెలియజేశారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో వారికి శని, ఆదివారం వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి విడుదలయ్యే కోటా రాష్ట్రానికి చేరేవరకు వాక్సిన్ ఇచ్చే పరిస్థితులు కనబడటం లేదు.