Vishal : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఎవరూ ఊహించనిది. చిన్న వయస్సులో ఆయన హఠాన్మరణం చెందడం అందరినీ కలవర పరచింది. 46 ఏళ్ల వయస్సులో పునీత్ కన్నుమూయడంపై ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక విశాల్ మాట్లాడుతూ.. ‘పునీత్ను తలచుకుంటే చిరునవ్వుతో కూడిన అతని ముఖం నా కళ్ల ముందే మెదులుతోంది. ఆయన మరణ వార్తను జీర్ణించుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది. పునీత్తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే. పునీత్.. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడని మరణించే వరకూ ఎవ్వరికీ తెలీదు. అలాంటి గొప్ప వ్యక్తి.. చేసిన సేవా కార్యక్రమాల్లో నేనూ భాగం కావాలనుకుంటున్నాను.
ఇక నుండి పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నిజం చెప్పాలంటే.. నాకు ఇప్పటివరకూ సొంత ఇల్లు లేదు. మా తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాను. ఇప్పటి వరకూ ఇంటి కోసం డబ్బు కూడబెట్టుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తాను. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని విశాల్ అన్నారు.