Manchu Vishnu : ఎన్నో గొడవలు, పోట్లాటల మధ్య మా ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. మా అధ్యక్ష పదవికి విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు వారు చేసే తప్పులను ప్రశ్నిస్తాము. మళ్లీ గొడవలు మొదటికే వస్తాయి, అలాంటప్పుడు రాజీనామా చేయడమే మంచిదని ప్రకాష్ ప్యానెల్ సభ్యులు తెలియజేశారు.
ఇదిలా ఉండగా గెలిచినా.. ఓడినా.. అది ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత అందరం కలిసి పని చేయాలంటూ విష్ణు చెప్పుకొచ్చారు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ గురించి మెగాస్టార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మా ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఈ గొడవలోకి విష్ణు లాగారు.
తాను ఎన్నికల అనంతరం గెలిచిన తర్వాత మొట్టమొదటి సారిగా తనకు తారక్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారని తను మొదటి నుంచి కూడా తనకు మద్దతుగా నిలిచారని అయితే కొన్ని కారణాల వల్ల ఓటింగ్ కి దూరంగా ఉన్నారంటూ.. విష్ణు ఎన్టీఆర్ గురించి తెలియజేశారు.