Chiranjeevi : గత కొద్ది రోజులుగా తారా స్థాయిలో జరిగిన మా ఎన్నికల ప్రచారానికి తెర పడి ఆదివారం ఎన్నికలు కూడా జరిగాయి. సాయంత్రం ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, తాత్కాలికమైన, చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదని అన్నారు. అందరూ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్తో కలిసి మంచు ప్యానెల్పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానెల్లో కేవలం నాగబాబు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కు దూరమైందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదల అయిన ఫలితాలను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వచ్చింది కనుక ఇవి ఏకపక్ష ఎన్నికలేనని భావించవచ్చు.