Pawan Kalyan : ఇటీవలి కాలంలో తెలంగాణలో చిన్నారి చైత్రపై హత్యాచారం సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిత్ర అనే ఆరేళ్ల అమ్మాయిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసు ఘటనపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అయింది. నిందితుడు రాజు చేసిన దారుణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంచు మనోజ్, విజయశాంతి, పవన్ కళ్యాణ్ వంటి సెలబ్స్ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే తెలంగాణాలో తన పార్టీ మీట్ ఒకటి ఉన్నందున దానికి హాజరయ్యి ఈ క్రమంలో చైత్ర తల్లిదండ్రులకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని పవన్ అందించారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
చిన్నారి చైత్రకు జరిగిన దారుణ ఘటనకు సంతాపం తెలియజేస్తూ రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం చైత్ర తల్లిదండ్రులకు అందజేసి జనసైనికులతో కలిసి జనసేన అధినేత పవన్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. చిన్నారి కుటంబం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారని జనసేన పార్టీ తమ ట్విట్టర్లో ప్రకటించింది. ఇక పవన్ కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వాన్ని బహిరంగ సభలలో, ట్విట్టర్ వేదికగా ఎండగడుతూ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ మాటల దాడికి వైసీపీ మంత్రులు సైతం ఘాటుగా స్పందించారు.